Wednesday, September 29, 2010

జీవితాల్ని అల్లే వాసుదేవన్...

తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కాంచీపురానికి సమీపాన కోటైకాల్ వాసి వాసుదేవన్ (45). ఈయనకు నాలుగున్నరేళ్ళ వయసున్నప్పుడు మశూచి వ్యాధి సోకి కళ్ళుపోయాయి. అదీగాక పిన్న వయసులోనే అమ్మానాన్నలు మరణించారు. ఇక మిగిలిన ఏకైక తోడు తన చెల్లెలే. ఒక పక్క అంధత్వం, మరోపక్క పేదరికం, ఆ పైన చెల్లెలి పోషణ భారం. ఎలాగో శ్రమకోర్చి చెన్నై పూందమల్లి అంధుల పాఠశాలలో 10 తరగతి చదువుకున్నారు. పూర్తిగా కష్టాలు అల్లుకున్న తమ అన్నాచెల్లెళ్ళ జీవితాల్ని గడిపేందుకు వైరు కుర్చీల అల్లిక పని నేర్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి కష్టాలు ఉన్నవారి జీవితాల్లో కనిపించే ఉమ్మడి దృశ్యం ఇదే. కానీ వాసుదేవన్ అక్కడితో ఆగిపోలేదు. తనకు ఈ మాత్రం జీవితాన్నిచ్చిన సమాజం కోసం తనవంతు ఏమైనా చెయ్యాలని సంకల్పించారు. దాంతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని అక్షరాస్యత ఆవశ్యకతను తెలియజెప్పడం మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్నప్పుడు సమీప గ్రామాల్లో తిరుగుతూ చదువుకోవాల్సిన అవసరం గురించి స్థానికులకు బోధిస్తుంటారు. పల్లె ప్రజలు వారి పిల్లల్ని చిన్నతనంలోనే పనులకు పంపిస్తుండటం వల్ల గ్రామీణ బాలలు చదువుకు, బాల్యానికి దూరమై జీవితాల్ని చిదిమేసుకోవడం వాసుదేవన్‌ను కలచివేసింది. అందుకనే వాళ్ళ జీవితాల్ని కూడా అల్లే పనిలో పడ్డారు. వాసుదేవన్ వల్ల ఎందరో బాలల జీవితాల్లో కొత్త కోణాలు ఉదయించాయి.