Saturday, March 28, 2009

ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా...

కొన్నేళ్ళ క్రితం అమెరికాలో మేథ్యూ లిసగే అనే మూడో క్లాసు చదివే విద్యార్థి తనుండే నగరంలోని ఆకలిగొన్న బీదవారి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. దాంతో అతను "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " అనే కార్యక్రమాన్ని ఆరంభించాడు. అది ఆరంభించిన నాలుగో ఏడు "హేమ్స్ ఫర్ ది హంగ్రీ " నలభై వేల డాలర్లని సేకరించి అనాథల పొట్టలని నింపగలిగింది.

మరో పిల్లవాడి కథ కూడా ఇలాంటిదే. ఆఫ్రికాలోని రోగగ్రస్థులైన బీదవాళ్ళ కోసం డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ కృషి చేస్తున్నాడని తెలిసిన పదమూడేళ్ళ జాన్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఓ ఉత్తరం రాశాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక ఏస్ప్రిన్ మాత్రల సీసా కొన్నానని, దాన్ని ఆఫ్రికాలోని డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ హాస్పిటల్‌లో పడేయగలరా అని అడిగాడు. ఓ లోకల్ రేడియో స్టేషన్‌కి ఈ సంగతి తెలియడంతో అది ఆ చిన్న పిల్లవాడి గొప్ప మనసు గురించి వార్తగా ప్రసారం చేసింది. అది విన్న ఎంతోమంది తగిన విధంగా స్పందించారు. దాంతో ప్రభుత్వం ఆ పిల్లవాణ్ణి, వేల మంది నుంచి ఉచితంగా వచ్చిన నాలుగు లక్షల డాలర్ల విలువ చేసే నాలుగున్నర టన్నుల మందులతో డాక్టర్ ఆల్బర్ట్ స్కైడ్జర్ నడిపే హాస్పిటల్‌కి విమానంలో పంపించింది.

ఆ పిల్లల్లోని నిజాయితీతో కూడుకున్న, బీదలకి సహాయం చేయాలనే తపనని చూసి దేవుడు వాళ్ళకి చేయాల్సిన సహాయాన్ని అనేకమంది మంచివాళ్ళని పరికరాలుగా వాడుకుని చేశాడు.

సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Tuesday, March 17, 2009

కార్ల దొంగ

టర్కీలోని ఓ దొంగకి 16 ఏళ్ళ క్రితం తను చేసిన నాలుగు కారు దొంగతనాలకి పశ్చాత్తాపం కలిగింది. ఆ నాలుగు కార్లలోంచి తను దొంగిలించి అమ్ముకున్న టేప్ రికార్డర్ల ఖరీదు అయిన నాలుగు వందల యూరో డాలర్లని సెంట్రల్ టర్కీలోని కిరిక్కాలె అనే ఊరి పోలీస్ చీఫ్ సలీంకి పంపించాడు. 1992లో తన చేసిన ఆ నాలుగు దొంగతనాల వివరాలని కూడా పంపాడు. ఒకొక్కరికీ వంద యూరో డాలర్లని ఇవ్వమని, తన క్షమాపణలని కూడా తెలియచేయమని కోరాడు. ఆ దొంగ మాత్రం అజ్ఞాతంగానే ఉండిపోయాడు.

సౌజన్యం : గౌరవనీయులు శ్రీ మల్లాదిగారు.

Thursday, March 12, 2009

ఓటర్ల కోసం గుంజీళ్ళ దీక్ష

తమిళనాట కోయంబత్తూరు జిల్లా పుదూర్ గ్రామానికి చెందిన వడ్రంగి 23 ఏళ్ళ రామనాథన్‌కు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేదు. తన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనమంతా ఎన్నికల్లో పాల్గొని మంచి నేతలను ఎన్నుకోవాలని మాత్రం గ్రహించాడు. తన కోరిక ఫలించాలని కోరుతూ తన ఊరిలో ఉన్న ఆది వినాయకర్ ఆలయంలో మే 8, 2006వ తేదీ ఉదయం 6 గంటలకు సుముహూర్తం నిర్ణయించుకుని 14 నిమిషాల్లో 1008 గుంజీళ్ళు తీశాడు. ఈ గుంజీళ్ళు సరిగ్గా తీశాడా లేదో గమనించడానికి అక్కడి "యూత్ పవర్ ఫెడరేషన్" ప్రతినిధులు వచ్చి పర్యవేక్షించారు. తన గుంజీళ్ళ దీక్ష పూర్తయిన తర్వాత రామనాథన్ మాట్లాడుతూ మన ప్రజాస్వామిక దేశంలో ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని, రాష్ట్ర భవిష్యత్తును మంచి బాటలో పయనింపజేయాల్సింది ఓటర్లే అయినందున అవినీతి, పక్షపాత వైఖరికి దూరంగా ఉండే నేతలను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాజకీయాల్ని అసహ్యించుకొని ఓట్లేయడం మానకుండా మంచివారికి ఓటు వేయడం ద్వారా స్వలాభం కోసం పాకులాడేవారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. తన కోసం కాకుండా జనం బాగు కోసం గుంజీళ్ళు తీసిన రామనాథన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ... జన జీవితంలో కొత్త కోణం ప్రకాశిస్తుంది.

పసివాడి హృదయం కరిగింది

"పిల్లలూ ఈ రోజు మీకో వీడియో చూపిస్తాం... అది చూచి మనకు తోచిన సాయం చేద్దాం" అని టొరంటోలోని ఒక స్కూలు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశమైన మలావీలోని బాలల దుస్థితిని వీడియో ద్వారా చూపించారు. ఆ స్కూల్లోనే చదువుకుంటున్న తొమ్మిదేళ్ళ భారత సంతతి విద్యార్థి నీల్ అగర్వాల్ పసి హృదయం మలావీ చిన్నారుల కష్టాలు చూచి కరిగిపోయింది. వెంటనే తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న 170 డాలర్ల మొత్తాన్ని (దాదాపు రూ.7,800) యునిసెఫ్‌కు విరాళంగా ఇచ్చేశాడు. నీల్ తండ్రి ప్రదీప్ అగర్వాల్ భారతీయుడు కాగా, తల్లి ఎలిజబెత్ కెనడాలో పుట్టి పెరిగిన ఇటలీ సంతతి మహిళ. ఇంత పెద్ద మొత్తం (ఆ కుర్రాడి వయసుకు ఇది పెద్ద మొత్తమే...) అలా ఎలా ఇచ్చేశావురా అని అడిగితే... నా వయసు పిల్లలు పేదరికంతో తిండి లేక పాఠశాలలకు కూడా వెళ్ళడం లేదని తెలిసి, ఆ డబ్బు నాకంటే వారికే ఎక్కువ అవసరమనిపించిందని బదులిచ్చాడు ఈ రెండవ బాల కర్ణుడు (ఇలాంటి మరో బాలుడి గురించి ఇంతకు ముందొక కథనం ఇచ్చాను అందుకే రెండవ బాల కర్ణుడు అన్నాను). ఈ ఘటన 2006లో జరిగింది.