Saturday, December 23, 2006

రోడ్ వాటర్ కారు... నడక భలే జోరు

ప్రజ్ఞకు వయసుతో సంబంధం లేదని యువ అవిష్కర్త వినోద్ రూపంలో మరోమారు నిరూపితమైంది. అనుకున్నది సాధించడానికి పాపం ఈ యువకుడు అప్పుల పాలు కావడానికి సైతం సిద్ధపడ్డాడు. కేరళ రాజధాని ట్రివేండ్రం సమీపంలోని బలరాంపురం ప్రాంతంలో ఉన్న రస్సెల్‌పురం వాస్తవ్యుడు పిఎస్ వినోద్ వయసు 2003 నాటికి 28 ఏళ్లు. అప్పటి వయసు ఇప్పుడెందుకు అనుకోవద్దు. ఈ మహత్కార్యానికి బీజం పడింది అప్పుడే.

వర్షాకాలం వస్తే కేరళ వాసులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. అందుకని రోడ్డు మరియు నీళ్లలో నడిచే కారును (Amphibious Car) తయారుచేయాలని వినోద్ నిర్ణయించుకున్నాడు. ఎస్సెస్సెల్సీ చదువుకొని, ఐటిఐలో రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రీషియన్ కోర్స్ చేసి కారు, ఎసీ మెకానిక్‌గా స్వంత వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వినోద్‌కు ఈ ఆలోచన వచ్చిందే తడవుగా పాతిక వేలకు ఒకటి చొప్పున 1985 మాడల్ మారుతీ కార్లు మూడు కొని తన ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతరత్రా చాలా మంది నుంచి 8 లక్షలకు పైగా అప్పులు చేయాల్సి వచ్చింది. మొత్తానికి మొదటి రెండు ప్రయోగాలు విఫలంకాగా (అంటే 2 మారుతీ కార్లు హాంఫట్...) మూడో ప్రయత్నం విజయవంతమైంది.

ఈ రోడ్ వాటర్ కారు పరిజ్ఞానాన్ని నేవీ, కోస్ట్ గార్డ్ విభాగాలకు ఇవ్వడానికి వినోద్ సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా కేరళ సహా ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లోను, ఈశాన్య భారత రాష్ట్రాల్లో రోడ్డు మార్గంతో పోటీపడుతూ వాటికి సమాంతరంగా కిలోమీటర్ల పాటు సాగే పొడవైన జల మార్గాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో రవాణాకు ఇదెంతో ఉపకరిస్తుంది. రద్దీ కారణంగా ఆలస్యం జరిగే పరిస్థితులను అధిగమించవచ్చు. ముంబై, చెన్నై నగరాల్లో ఆ మధ్య సంభవించిన భారీ వరదలకు రోడ్లన్నీ రోజుల తరబడి నీళ్లలోనే ఉండిపోయాయి. ఇలాంటి సమస్యలకు వినోద్ రూపొందించిన రోడ్ వాటర్ కారు సరైన సమాధానం. సాంకేతికంగా తగు జాగ్రత్తలు తీసుకొని, అన్ని విధాలా పటిష్టంగా ఉండేలా వినోద్ ఈ కారును రూపొందించాడు. ఒక స్నేహితుని సాయంతో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ దృష్టికి వచ్చిన వినోద్ కృషిని ఆ సంస్థ వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఇతరులు సైతం ఇలాంటి వాటిని రూపొందించినప్పటికీ వినోద్ పిన్న వయసులోనే వాటికంటే మెరుగ్గా ఈ రోడ్ వాటర్ కారును తయారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం లేదా ఇతర సంస్థల నుంచి ఆశించిన ప్రోత్సాహం లేకుంటే... ఇలాంటి రోడ్ వాటర్ వాహనాల తయారీ, వినియోగం అధికంగా ఉన్న ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ లేదా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలకోసం వెళ్లిపోయిన భారతీయుల్లో వినోద్ కూడా ఒకడై ఇతని జీవితంలో మరో కోణం మొదలయ్యే అవకాశం ఉంది. అప్పుడు మరో రోజున భారత ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహించే ప్రవాసభారతీయ వేడుకలకు ఇతన్నే పిలిచి ఎన్నారైల కోసం రూపొందించిన ఏదో ఓ కొత్త పథకాన్ని అతని చేతే మొదలుపెట్టించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే, మన గొప్పదనాన్ని విదేశాలు గుర్తించాకేగా మనవాళ్లూ అహో అనేది.

Saturday, November 18, 2006

ఎనభై ఏళ్ల పడుచు

అవును... తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కూత్తూర్ గ్రామంలో ఉన్న వినోభా ఆశ్రమ నిర్వాహకురాలు కృష్ణమ్మాళ్‌ను ఎనభై ఏళ్ల పడుచు అనడమే సబబు. ఎందుకంటే అభాగ్యుల తరపున అహింసా మార్గంలో పోరాటం చేసి, అనుకున్నది సాధించడానికి ఆమె ఈ వయసులోనూ సిద్ధంగా ఉంటారు. అసలు ఎవరీ కృష్ణమ్మాళ్ ? 80 ఏళ్ల కిందట తమిళనాడులోని ఒక అతి సామాన్య కుటుంబంలో పుట్టారామె. కేవలం పండుగ రోజుల్లో మాత్రమే వాళ్ల ఇంట్లో బియ్యపు అన్నం కనిపిస్తుంది. అమ్మాయిలకు చదువులంటే పెద్దలనబడేవాళ్లు గయ్యిమనే ఆ రోజుల్లోనే పట్టభద్రురాలై మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. డిగ్రీ పట్టా చేతికి రాగానే కృష్ణమ్మాళ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎగబడలేదు. బడుగు వర్గాల తోడుగా నిలిచి సమాజ సేవలో తరించాలని ఆమె నిర్ణయించుకున్నారు.

అదే సమయంలో భూదానోద్యమ సారధి ఆచార్య వినోభాభావె శిష్యులు జగన్నాథన్ పరిచయమై ఈమె లక్ష్యానికి మరింత బలం చేకురేలా దిశా నిర్దేశం చేశారు. అది ఆదిగా కృష్ణమ్మాళ్ తన సేవలను విస్తృతం చేశారు. బడుగు వర్గాలకు చేయూతనిచ్చే క్రమంలో తాను నడిపిన అహింసాయుత పోరాటాల్లో భాగంగా ఈమె ఎన్నోమార్లు జైలుకెళ్లారు. నాగపట్టణం జిల్లాలోని కీళ్‌వెన్మణి ప్రాంతంలోని రైతు కూలీలు తమ వేతనాలు పెంచమని అడిగినందుకు వారిని భూస్వాములు మరిన్ని వెతలకు గురిచేశారు. వారి పోరాటానికి చేయూతనిచ్చిన కృష్ణమ్మాళ్ పరిస్థితులను చక్కబరిచారు. అంతటితో ఆగక వారిని రైతు కూలీల స్థాయి నుంచి రైతులుగా మార్చేందుకు తానే స్వయంగా "లాబ్ టీ" అనే సంస్థను కూడా ప్రారంభించారు. భూమి లేని రైతులకు భూములనిప్పించడం, పంటలు పండించడంలో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, పేదల పిల్లలకు చదువులు చెప్పించడం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలను కృష్ణమ్మాళ్ చేపట్టి విజయాలు సాధించారు.

లక్ష్యసాధనలో వెనుకంజ వేయడం తెలియని కృష్ణమ్మాళ్ గాంధేయవాది. వినోభా శిష్యురాలిగా వారి ఆదర్శాలనే అనుసరించారు. వేధింపులు ఎదురైనా... ఆకలి పోరాటాలకు గురైనా మొక్కవోని దీక్షతో ఈ వయసులోనూ ఆమె ముందడుకు వేస్తున్నారు. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలను పూయిస్తున్నారు.

Wednesday, September 27, 2006

ఖేంద్రీ.... కంటి చూపుతో నింపేస్తా

ఈ మధ్య చాలా మంది "కంటి చూపుతో చంపేస్తా" అనే ఒక సినిమా డైలాగ్‌ను పదే పదే వాడుతున్నారు. కానీ పంజాబ్‌కు చెందిన విజయ్‌పాల్ ఖేంద్రీ మాత్రం అంధులకు కంటి చూపునిచ్చి వాళ్ల బతుకుల్ని వెలుగులతో నింపేస్తా అంటున్నారు. వ్యక్తిగా... శక్తిగా... వ్యవస్థగా ఇదీ ఆయన జీవితం.

డెబ్భై ఐయిదేళ్ల వయసు... మామూలుగా అయితే ఈ వయసు వ్యక్తులు గత స్మృతులు నెమరు వేసుకుంటూ కాలక్షేపం బఠానీలు తింటూ (పళ్లు ఊడకుండా ఉంటే...) కబుర్లు చెబుతూ కాలం వెళ్లదీస్తుంటారు. దాదాపు 25 (ఈ కథనం రాసేనాటికి) ఏళ్ల కిందట జీవిత బీమా సంస్థ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన ఖేంద్రీని వీరిలో ఒకరిగా చూడలేం. సేవా తత్పరతతో తపించే నిండు మనసు ఆయనది. కంటి సమస్యలతో సతమతమవుతున్న కొందరు వ్యక్తులు ఓ రోజున ఖేంద్రీ కంటబడటంతోనే ఓ మహా నేత్రోద్యమానికి బీజం పడింది. వారికి తన స్వంత ఖర్చుతో శస్త్ర చికిత్సలు చేయించి వారి కళ్లలో వెలుగులు పూయించారు ఖేంద్రీ.. అజ్ఞానం, పేదరికం కారణంగా కంటి చూపు కరవై దృష్టికి దూరమైన అభాగ్యుల జీవితాల్ని వెలుగులతో నింపాలని ఆ క్షణాన ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే స్నేహితులను, ఆత్మీయులను కలుసుకొని తన ఉద్దేశాన్ని బయటపెట్టారు.

శుభ సంకల్పానికి చేయూతనివ్వని చేయి ఉంటుందా...? పంజాబ్‌లోని పుణ్యక్షేత్రమైన అమృత్‌సర్ పట్టణం కేంద్రంగా వీరి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. కంటి సమస్యలతో బాధపడేవారికి వైద్యపరమైన తోడ్పాటునిచ్చేందుకు ఖేంద్రీ తన బృందంతో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యకలాపాలు పలువురి ప్రశంసలకు పాత్రం కాగా అన్ని వర్గాల సహకారంతో 1995లో అమృత్‌సర్ మెడికల్ అండ్ ఐ రిలీఫ్ సొసైటీ (ఎఎమ్ఇఆర్ఎస్) ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ పేరు వింటే చాలు పంజాబ్‌లోని వేలాది గ్రామాల్లోని ఎన్నో హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి. ఎందుకంటే అసంఖ్యాకంగా ఎందరో గ్రామీణులు ఎఎమ్ఇఆర్ఎస్ ఉచిత సేవల ద్వారా కంటి చూపు పొందినవారే.

ఒక్కోసారి శిబిరాలను నిర్వహించాలని కోరుతూ కొన్ని గ్రామాలవారు స్వయంగా ఈ సంస్థను కోరుతుంటారు. నెలకు కనీసం 8 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఈ సంస్థ చేస్తున్న సేవలు మంచితనానికి మారుపేరుగా కొనసాగుతున్నాయి. ఎన్నో జీవితాల్లో కొత్త కోణాలను అవిష్కరిస్తున్నాయి. సత్సంకల్పానికి కాలం, వయసుతో పనిలేదనేదే ఖేంద్రీ జీవితం మనకు ఇచ్చే సందేశం. ఏమంటారు ?

Thursday, August 31, 2006

ఈ అమ్మ ఒక విజేత...

చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో అడవి మనిషిగా పెరిగిన చిరంజీవిని సంఘ శక్తిగా తీర్చిదిద్దిన తల్లిగా శారద పాత్ర మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మీరు చదవబోయే నిజ జీవిత కథనం ఇలాంటిదే. తమిళనాడులోని చిదంబరం పుణ్యక్షేత్రంలో నివసిస్తున్న పద్మా మోహన్ పాత్ర ఆ శారద పాత్రకు ఏమీ తక్కువ కాదు. ఆ సినిమాలో చిరంజీవి మహారణ్యంలో పెరిగితే ఈమె కొడుకు లలిత్‌కుమార్ జనారణ్యంలో పెరిగాడు. ఇక మిగిలిన విశేషాలకు వస్తే...

ఆంధ్రలోని నెల్లూరు జిల్లాకు చెందిన పద్మా మోహన్ భర్త మోహన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. ఉద్యోగం నిమిత్తం తమిళనాడులో ఉంటున్నారు. పద్మా మోహన్ కొడుకు లలిత్ కుమార్ పుట్టుకతోనే అంధుడు మాత్రమేగాక చిన్నవయసుకే డౌన్‌సిండ్రోం, ఆటిజం బారినపడటంతో మెదడుపై ప్రభావం చూపి వినికిడి, మాటలు, ఎదుగుదల సమస్యలు ఏర్పడ్డాయి. మొత్తం మీద మానసికంగా శారీరకంగా తీవ్రస్థాయిలో అంగ వైకల్యానికి గురయ్యాడు. ఇక ఆ తల్లి బాధను మాటల్లో వర్ణించగలమా...?

లలిత్ కుమార్ చిన్న వయసులో ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడే తల్లి పద్మ సైతం అనారోగ్యం పాలైయ్యారు. ఈమెను చికిత్సకోసం చెన్నై ఆసుపత్రిలో చేర్పించినప్పుడు యోగాను ఆశ్రయించి కోలుకున్నారు. తనకు స్వస్థతనిచ్చిన యోగాను ఆయుధంగా చేసుకొని తన కొడుకును బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్న పద్మ అనుకున్నది సాధించారు. తన కొడుకు కోసం ఆమె కూడా బ్రెయిలీ లిపి నేర్చుకొని, అతనికి దాదాపు 100 యోగాసనాలు వేయడంలో తర్ఫీదునిచ్చారు. తల్లి సాయంతో ఈ రోజున లలిత్ కుమార్ ఏమేం సాధించాడో తెలుసా ?

భారత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా యోగాలో జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. 2005లో ప్రభుత్వం నుంచి బెస్ట్ క్రియోటివ్ ఛైల్డ్ అవార్డు సహా తమిళనాడు యోగా సంఘం, సాయ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. కర్ణాటక సంగీతంలో కచేరీలు, మృదంగ వాదనలో నైపుణ్యం సాధించాడు. అన్నామలై విశ్వవిద్యాలయంలో యోగా డిప్లమో చెయ్యడానికి వయసు చాలకపోతే లలిత్ కుమార్ ప్రతిభను గుర్తించిన ప్రో-ఛాన్స్‌లర్ వయసు నిబంధనను సడలించి అవకాశాన్నిచ్చారు.

లోపాలున్న మనిషిని మాటలనే తొలిచే ఈ సమాజంలో తనను అందమైన శిల్పంగా మలిచే బాధ్యతను విజయవంతంగా నిర్వహించిన తన తల్లే తాను నిత్యం కొలిచే దైవం అంటాడు లలిత్ కుమార్.

తన కుమారుడి ఉన్నతిలోనే ఆనందాన్ని పొందుతున్న ఈ అమ్మ జీవితంలో కొత్త కోణం ఇది.

Monday, July 31, 2006

రామా చిలకమ్మా.. ప్రేమా మొలకమ్మా...

...అనే ఈ మెగా సూపర్ హిట్టే కాదు... చిట్టీ చిలకమ్మా.. అమ్మా కొట్టిందా.. మా గూట్లో కొస్తావా లాంటి చిలకల పలుకుల పాటలు కూడా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని మావూళ్లయ్య, వాసవి దంపతులకు కంఠోపాఠమే. ఎందుకంటే వాళ్లింటికి వెళితే మీకు ముందుగా స్వాగతం పలికేవి రామ చిలుకలే కనుక.

అసలు సంగతేంటంటారా, అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో... గత ఇరవైయ్యేళ్లుగా మావూళ్లయ్య, వాసవి దంపతులు ఈ చిలుకల్ని దేవుడిచ్చిన పిల్లలుగా భావించి సాకుతున్నారు. ఉదయం ఆరున్నర కాగానే ఆ ఊరి చిలకలన్నీ మావూళ్లయ్య నడిపే బియ్యం దుకాణం ముందు వాలిపోతాయి. దుకాణం ముందు వీటి కోసమే మావూళ్లయ్య దంపతులు ఉంచే బియ్యాన్ని ఆరగిస్తూ ఆట పాటలతో రోజూ ఆనందంగా గడిపేస్తుంటాయి. వీటి కోసమే ప్రతిరోజూ సుమారు మూడు లేదా నాలుగు కిలోల నాణ్యమైన బియ్యాన్ని ఆ దంపతులు ప్రత్యేకంగా ఉంచుతారు.

వివరాల్లోకి వెళితే.... మావూళ్లయ్య దాదాపు 30 ఏళ్ల కిందట సిద్ధాంతం వచ్చి బియ్యం దుకాణాన్ని ప్రారంభించారు. ఓ రోజున ఒక చిలుక ఆయన కొట్లోకి వచ్చి బియ్యం రుచి చూసింది. దాన్ని ఆయన ఏమీ అనకపోవడంతో ఈ అనుకోని అతిథుల సంఖ్య అలా అలా పెరిగి ఇప్పటికి యాభైకి చేరుకుంది. ఆ అనుబంధం అలా పెరిగి పెనవేసుకుపోయింది. ఊళ్లకు వెళ్లాల్సివచ్చినప్పుడు వీటికోసం ఎప్పుడూ ఇల్లు, దుకాణం తెరిచి ఉండేలా మావూళ్లయ్య దంపతులు సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. చిత్రం ఏమంటే ఇప్పటి వరకూ చిలుకలు రాని రోజే లేదు. వీటి గురించి ఎవరైనా అడిగితే వారి నుంచి వచ్చే సమాధానం "ఈ పచ్చని చిలుకలు సీతారాముల ప్రతిరూపాలు" అని.

Friday, June 30, 2006

పురుగు... పరుగో పరుగు

ఆయన పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు ఉత్పత్తి చేసే ఎరువుల పనితీరు చూశాడు. వందలు, వేలాది రూపాయల ఖర్చుతో కొన్న ఆ రసాయనిక ఎరువులు పురుగుల్ని చంపలేవు సరికదా... రైతుకు, పంటలకు మేలు చేసే వనరులు సైతం హరించుకుపోతాయి. పైగా వాతావరణ కలుషితం, అనారోగ్యాలూ మామూలే. దీని నుంచి ఎలా తప్పించుకోవాలో.. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి. మరి మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ముబారక్‌పూర్‌కు చెందిన పొన్నుస్వామి అనే రైతు ఏం చేశారో తెలుసా...

నిర్దిష్ట నిష్పత్తుల్లో వేప, కానుగ గింజలు, ఎండు సీతాఫలాలు, జట్రోపాలను పొడిచేసి, రెండు రకాల బ్యాక్టీరియాలను (డీ కంపోజ్డ్ బ్యాక్టీరియా, బి బ్యాక్టీరియా) మిశ్రమించి, బెల్లం నీటిలో ఆ పొడిని కలుపగా తయారైన సేంద్రీయ ద్రావణాన్ని తన పొలంలో పిచికారీ చేశారు. అంతే... కూరగాయలు, పత్తి, ద్రాక్ష వంటి పొలాల నుంచి పురుగులకు విముక్తి లభించింది. గత రెండేళ్లుగా ఈయన ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పైగా ఈయన అనుసరిస్తున్న పద్ధతి సరైనదేనంటూ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శశిభూషణ్ కూడా నిర్ధారించారు.

తన విధానంపై పొన్నుస్వామి ఏమంటారంటే... ఈ పద్ధతిలో విషరహిత కాయగూరలను ఉత్పత్తి చేయవచ్చని, తద్వారా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెరుగై, అధిక ధర లభిస్తుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి రైతులకు శిక్షణనివ్వడానికి తాను సిద్ధమేనంటున్నారు. పై వస్తువుల కోసం సామాజిక వన విభాగం అధికారులు, బయో ఫెర్టిలైజర్స్ విక్రేతలను సంప్రదించవచ్చు.

పొన్ను స్వామి చెప్పిన విధానం....

250 కిలోల వేపగింజలు, 250 కిలోల జట్రోపా గింజలు, 250 కిలోల కానుగ గింజలు, 250 కిలోల ఎండు సీతాఫలాలు కలిపి పొడి చెయ్యాలి. మొత్తం 1000 కిలోల పొడిలో డి-కంపోజ్డ్ బ్యాక్టీరియా కలిపి నెల్లాళ్ల పాటు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమానికి కిలో బి-కంపోజ్డ్ బ్యాక్టీరియా కలిపి మరో నెల్లాళ్లు అలాగే ఉంచాలి. తర్వాత 200 లీటర్ల నీళ్లకు కిలో బెల్లం చేర్చి ఉంచాలి. ఇదంతా పూర్తయ్యాక డి, బి - బ్యాక్టీరియాలు కలిపి ఉన్న గింజల పొడి మిశ్రమాన్ని 20 కిలోలు తీసుకొని బెల్లం నీళ్లలో కలిపి 10 రోజుల పాటు నిల్వ చేస్తే క్రిమి సంహారక ద్రావణం సిద్ధమవుతుంది. దీనిని వడకట్టి ఉపయోగించాలి.

పై విధానంలో సిద్ధంగా ఉన్న 10 లీటర్ల ద్రావణానికి మరో 10 లీటర్ల స్వచ్ఛమైన నీటిని కలిపి పంటపై ఏడెనిమిది రోజులకోసారి పిచికారీ చెయ్యాలి. కూరగాయల తోటలకు నాలుగు సార్లు, పత్తి లేదా ద్రాక్ష వంటి పంటలకు ఐదారు సార్లు పిచికారీ చేస్తే... పురుగులు... పరుగో... పరుగు...

నేటి తరం విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులుగా మారి, రైతులకు అందుబాటులో లేని ధరల్లో, వారికి అంతగా ఉపకరించని క్రిమిసంహారక మందులను అమ్ముతూంటే... పొన్నుస్వామి లాంటి వారు తమ అనుభవ పరిజ్ఞానంతో రైతాంగం జీవితంలోనే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

జై జవాన్... జై కిసాన్ అని మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఊరికే అన్నారా మరి. అందులోనూ... మన పొన్నుస్వామి.... నిజంగా బంగారయ్యే. ఎందుకంటే... పొన్ను అంటే తమిళంలో బంగారం అని అర్థం.

Wednesday, May 31, 2006

నిన్న టీ విక్రేత.... నేడు ఐఏఎస్ విజేత

ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా సింఘపూర్ గ్రామంలో నివసిస్తున్న సాహు అనే 62 ఏళ్ల పెద్దమనిషికి గత 30 ఏళ్లుగా తెలిసిన ఏకైక వృత్తి టీ తయారు చేసి బిస్కెట్లు అమ్ముకోవడమే. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. భార్య ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలతో ఉన్న సాహు కుటుంబానికి అతని సంపాదన ఏ మూలకూ చాలదు. మరి ఆయన కొడుకు మనోజ్ కూడా అదే వాతావరణంలో పెరిగినా తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తూ అక్షరాల పుట్టగా రూపొందాడు. ఆ ఊరి పల్లెటూరిలో తన కొడుకు ఒక టీచరు ఉద్యోగం సంపాదిస్తే చాలని మనోజ్ తండ్రి సాహు బుల్లి ఆశ మాత్రం పెట్టుకున్నాడు. ఆ తండ్రికి మనోజ్ అందించిన కానుక ఏమిటో తెలుసా ? ఎటువంటి కనీస సదుపాయాలూ లేని పరిస్థితుల్లో, ఏ మాత్రం శిక్షణ లేకుండా పల్లె వాతావరణంలో పెరిగిన మనోజ్ ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడై జాతీయ స్థాయిలో 34వ ర్యాంకు సాధించాడు. వేలకు వేలు ఫీజులు పోసి పట్టణాల్లోని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరూ పెద్ద పెద్ద శిక్షణా కేంద్రాల్లో చేరి సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న సంగతి అందరికీ తెలుసు.

మనోజ్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. 10వ తరగతి వరకూ తన పల్లెటూరిలోనే చదువుకున్న మనోజ్ తన ప్రతిభతో ప్రభుత్వ ఉపకార వేతనం పొంది భువనేశ్వర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో యు.జి ముగించాడు. ఆ తర్వాత గుజరాత్‌లోని జునాగఢ్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్‌లో ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. తర్వాత ఉద్యోగాన్వేషణలో ఢిల్లీ వెళ్లి విజయవంతంగా స్వయంకృషితో సివిల్స్ పూర్తి చేశాడు. కేవలం స్వశక్తితోనే ఎదిగిన మనోజ్‌ను మే 28న గ్రామస్తులంతా కలిసి ఉరేగింపుగా తీసుకెళ్లి గౌరవించగా, అతనికి చదువు చెప్పిన ఆ ఉరి ఉపాధ్యాయులే దండలు వేసి ఆశీర్వదించారు. అదే విధంగా ఆనందభాష్పాల మధ్య అతని తల్లిదండ్రులనూ సత్కరించారు. ఆత్మబలం ఉండాలే కానీ దేనినైనా సాధించేందుకు పేదరికం అడ్డుకానేకాదని నిరూపించిన ఎందరో బుద్ధిజీవుల సరసన ఇప్పుడు మనోజ్ కూడా నిలిచాడు. సింఘపూర్ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి బిడ్డే ఈ ఘనతను సాధించినంత ఆనందపడుతున్నారు.

Saturday, April 29, 2006

మధుమేహం కళ్లు పీకినా... సడలని పట్టుదల

పుట్టుకతోనే కళ్లు లేకపోవడం వేరు. జీవితంలో కొన్నేళ్ల పాటు కళ్లతో ఈ లోకపు అందాలను ఎంతో ఆనందించి, అనుభవించిన తరువాత ఆ కళ్లను పోగొట్టుకోవడం మరింత బాధాకరం. ఈమె జీవితంలోనూ ఇదే జరిగినా, తన ధైర్యాన్ని కోల్పోలేదు సరికదా, పట్టుదలతో ముందడుగు వేసి, చివరకు రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఔట్ స్టాండింగ్ డిజేబుల్డ్ ఎంప్లాయ్ అవార్డును చేజిక్కించుకుంది. మదురైకి చెందిన డాక్టర్ ఉషానాగరాజన్ (41) స్ఫూర్తిదాయక జీవితం ఇది. 1987లో ఎంబిబిఎస్ పూర్తి చేసి స్పెషలైజేషన్ దిశగా అడుగులేద్దామనుకుంటున్న సమయంలో ఆమె కాలికి వేసిన పుండు ఉగ్రరూపం దాల్చడంతో ఎగబాకిన ఇన్ఫెక్షన్ ఉష కళ్లను కూడా కబళించింది. డయాబెటిక్ రెటీనోపతి ఫలితంగా ఉష జీవితం చీకటిమయమైంది. చిన్నతనం నుంచీ చదువులో మంచి ప్రతిభ కనబరిచి ఉపకారవేతనాలు కూడా పొందిన ఉష డాక్టరై ఎందరికో సేవ చేయాలని తపనపడేవారు. ఈ నేపథ్యంలో ఆమె కళ్లు పోవడంతో పరిస్థితిని జీర్ణించుకోలేని పరిణామాలు చోటుచేసుకున్నా... తను నేర్చుకున్న విద్యతోనే ఎలాగైనా ముందడుగేసి ఇతరులకు చేయూతనిచ్చే స్థాయికి ఎదగాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నారు ఉష. వెంటనే తన వైకల్యాన్ని అధిగమించేందుకు బ్రెయిలీ సహా పలు అంశాలపై రెండేళ్లపాటు తగిన శిక్షణ పొందారు. అనంతరం తన ప్రతిభతో మదురైలోని మదురై కెనెట్ ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా చేరి రోగులకు సేవ చేస్తున్నారు. అంతేగాక ఈ సంస్థకే చెందిన స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సులకు వివిధ అంశాల్లో పాఠ్యాంశాలను ఉష బోధిస్తున్నారు. ఇంతటితో ఆగక అంగవికలురకు చేయూతనిచ్చే పలు సంస్థలకు ఉష అండగా నిలిచి వైద్య సేవలందిస్తున్నారు. ఆమె మదురైలోని రోటాక్ టాకింగ్ లైబ్రరీ సలహా మండలి సభ్యురాలిగా కూడా ఉన్నారు. తన సేవలతో అందరినీ మెప్పించిగా లయన్స్ క్లబ్, జేసీస్ క్లబ్ వంటి సంస్థల పురస్కారాలు ఉషను వెదుక్కుంటూ వచ్చాయి. కర్ర సాయం లేకుండానే పనులు చేసుకోవడంలో భర్త నాగరాజన్ ఉషకు ప్రత్యేక శిక్షణనివ్వడంతో ఆమె స్వంతంగా వంట కూడా చేయగలరు. తన కుమారుడు సంజీవ్ కూడా నేత్ర వైద్యంలో పరిశోధన చేసి మరెందరికో సేవలందించాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. కళ్లు పోయినా తన జీవితంలో కోత్త కోణాన్ని ఆవిష్కరించి ఉషస్సును నిలుపుకున్న ఉష జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమనడంలో సందేహమేముంది ?

Friday, April 21, 2006

తేనెటీగలు మళ్లీ వచ్చాయి....

ఇది 1993 నాటి విషయం. అప్పట్లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా చెరువతూర్ ప్రాంతంలో వ్యవసాయ శాఖ చిరుద్యోగిగా పనిచేస్తున్న 57 ఏళ్ల లీలా కుమారిపై ఆ రాష్ట్ర ప్లాంటేషన్ కార్పోరేషన్ అధికారులు పగబట్టారు. ఆమెపై దాడి చేయడానికి గూండాలను పంపడమే గాక ఆమె ఇంటిపై పెస్టిసైడ్ కంపెనీ హెలికాఫ్టర్‌తో రసాయనాన్ని కుమ్మరించారు. ఇంతకూ లీలాకుమారి చేసిన తప్పల్లా... ఎండోసల్ఫాన్ రసాయనాన్ని ఇక్కడి జీడి తోటల్లో చల్లవద్దనడం, ఇందుకోసం ఆవిడ కోర్టుకెక్కడం. ఈ ప్రాంతంలోని జీడితోటల్లో పురుగులను చంపడానికి ప్లాంటేషన్ శాఖ హెలికాఫ్టర్ ద్వారా ఎండోసల్ఫాన్ రసాయనం సృష్టించిన అల్లకల్లోలమే సమస్యకు మూలకారణం. ఈ రసాయన ప్రభావం ఆ తోటల్లోని పురుగులను చంపడంతో ఆగిపోలేదు. అక్కడి జనం ఆరోగ్యంతో చెలగాటమాడింది. ఈ రసాయనాన్ని తోటల్లో చల్లినప్పుడల్లా ఆ ప్రాంతవాసులకు ఆస్మా, క్యాన్సర్, నరాలు, మెదడు, స్త్రీలకు పునరుత్పత్తి సమస్యలు.... ఇలా ఎన్నెన్నో వ్యాధులు వారిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అంతేకాదు ఇక్కడి పర్యావరణం కూడా స్తంభించి పక్షులను పారిపోయేలా చెసింది. మరోపక్క రైతులు కట్టే గూళ్లలో చేరి పుట్టతేనెను పండించే తేనెటీగలు తుర్రుమన్నాయి.

ఈ ఎండోసల్ఫాన్ విషపూరితమైనదని యూరోపియన్ యూనియన్, అమెరికా ఎన్విరానమెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీలు దీనిని నిషేధించినా గత 18 ఏళ్లుగా సుమారు 5 వేల ఎకరాల్లో ఈ రసాయనాన్ని కుమ్మరించారు ప్రభుత్వాధికారులు. దీని ప్రమాదకర ప్రభావాన్ని గుర్తించి పొరాటానికి సన్నద్ధమైన లీలా కుమారికి మొదట గ్రామస్ధుల సహకారం లభించకపోయినా తర్వాత చేయూతనిచ్చారు. లీలా కుమారి పట్టుదలకు మీడియా తోడ్పాటు లభించడంతో పాటు స్థానిక వైద్యులు కూడా దిగజారిన ఇక్కడి ఆరోగ్య ప్రమాణాలపై నివేదికలిచ్చారు. మరోవైపు ఢిల్లీలోని సెంటర్ పర్ సైన్స్ అండ్ ఎన్విరానమెంట్ సైతం రంగంలోకి దిగి ఈ ప్రాంతవాసులకు రక్త పరీక్షలు చేసి జరుగుతున్న దారుణాన్ని ధృవీకరించింది. దీంతో కేరళ హైకోర్టు ఎండోసల్ఫాన్ పిచికారీని పూర్తిగా నిషేధించింది. ఫలితంగా చెరువతూర్ ప్రాంతంలోని పర్యావరణ, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. స్వచ్ఛంద సంస్థలు వైద్యసేవలందించాయి. ఇప్పుడిక్కడి రైతులంతా సేంద్రీయ ఎరువులనే వాడుతున్నారు. ఇదంతా లీలాకుమారి చలవే మరి.

ఈ రసాయనం కారణంగా అనారోగ్యం పాలైన తన కొడుకు చికిత్సకు అవుతున్న ఖర్చులు, మరోవైపు ఈ కేసుకై అవుతున్న వ్యయభారం, ఇంచుమించు అదే సమయంలో తానూ ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైనా.... లీలాకుమారి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయం సాధించింది. తాను ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ, జరుగుతున్న్ దారుణాన్ని ఎండగట్టేందుకు మరో ప్రభుత్వ సంస్థతో పోరాటానికి వెనుకాడలేదామె. కొట్టాయం జిల్లాలోని కిజుతిరి గ్రామంలో 11 మంది సంతానం ఉన్న కుటుంబంలో ఏడో బిడ్డగా పుట్టిన లీలాకుమారి వ్యవసాయ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సును మాత్రమే చదివారు. వ్యవసాయ శాఖలో ఆమె ఉన్నతాధికారి కూడా కాదు. అంతా బాగుండాలనే ఆమె తపన అందరి జీవితాల్లోనూ కొత్తకోణాలను చూపించింది. దశాబ్దాల కిందటే తుర్రుమన్న తేనెటీగలు తిరిగొచ్చాయి, పారిపోయిన పక్షుల కిలకిలారావాలు మళ్లీ వినిపించాయి.

Saturday, April 15, 2006

సాహసంతో సావాసం

మేకుల మొనలు పైకి ఉండేలా దిగ్గొట్టి ఉన్న బల్లపై ఏమాత్రం సంకోచం లేకుండా వెల్లకిల్లా పడుకొని ఉండగా.... ఛాతీపై 10 నాపరాళ్లను పెట్టించుకొని పగులగొట్టించుకొనే శరీరం అది. చేతుల మీద నుంచి ఓ పాతిక ముప్పై కార్లు వెళ్లినా ఆ ముఖంపై చిరునవ్వు చెరగదు. తలపై, ఒంటిపై ఓ పదులకొద్దీ ట్యూబులైట్లను పగలగొడుతున్నా... అదే చిరునగవు. కళ్లకు గంతలు కట్టుకొని బులెట్ నడపడం, తాను పడుకొని తన పొట్టపై నుంచి ఇద్దరు కూర్చొని ఉన్న మొటార్ సైకిల్ వెళుతున్నా పెద్దగా పట్టించుకోకపోవడం.... ఇవండీ ఆ మనిషి చేసే పనుల్లో కొన్ని. పై విషయాలన్నీ వినగానే కండలు తిరిగిన గండర గండడు, మాయా మహేంద్రజాల విద్యలు తెలిసిన మాయగాడు గుర్తొస్తున్నాడు కదూ. ఈ సాహసి ఎవరో తెలుసా... 17 ఏళ్లకే అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణపతకాన్ని జయించిన ఖమ్మం వాసి కల్యాణి. ఈ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెంకటనారాయణ, రాజ్యలక్ష్మిల కుమార్తె అయిన కల్యాణి కరాటేలో బ్లాక్ బెల్ట్ విజేత. పిన్న వయసుకే అన్ని రకాల వాహనాలూ నడపడం నేర్చుకుంది. తల్లి రాజ్యలక్ష్మి మూత్రపిండాల జబ్బుతో మంచాన పడగా ఆమెకు ఎప్పటికప్పుడు సేవలందిస్తూనే అన్ని విద్యల్లోనూ కల్యాణి నైపుణ్యం సాధించింది. ఇవన్నీ చూసుకుంటూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కల్యాణి అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, ఇతర ఆటలన్నిటిలోను రాణించి, బాలరత్న అవార్డు కూడా గెల్చుకొని, మార్షల్‌ఆర్ట్స్‌లో రెడ్‌బెల్ట్ దిశగా పయనం సాగిస్తోంది (ఈ వివరాలు అందేనాటికి) . కల్యాణికున్న పట్టుదలలో కొంతైనా మనకూ ఉంటే లోకకల్యాణమే.

Tuesday, April 11, 2006

వడియాలతో వడివడిగా...

ఆయన మొదట పట్టు పురుగుల పెంపకం చేపట్టారు. ఫలితం నష్టాలు. తర్వాత కోళ్ల ఫారం పెట్టారు. ఫలితం కష్టాలు. ఇది కాదనుకొని ఎస్టీడీ బూత్ పెట్టగా కష్టనష్టాలు నట్టింట నడిచాయి. ఇక లాభం లేదనుకొని ఆయన శ్రీమతి గంగా భవాని కేవలం 15 రూపాయలు పట్టుకొని రంగప్రవేశం చేసారు. తెలుగింటా రోజూ కరకరలాడే ఆవిరి వడియాల తయారీకి శ్రీకారం చుట్టారు. ఆవిడకు తెలిసిన విద్య అదే. మరి ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఈమె కేంద్రంలో ఒక రోజుకు ఉత్పత్తి చేసే సుమారు 40 నుంచి 50 కిలోల వడియాలు విజయవాడ, విశాఖ, గుంటూరు తదితర పట్టణాల్లోని ప్రముఖ హొటళ్లకు పరుగులు తీస్తుంటాయి. తన అవిడియాలతో (సారీ ఐడియాలతో.... జస్ట్ ప్రాసకోసం) ఎన్ని రకాల ఒడియాలు చేస్తారో చెప్పనా ? కొత్తిమీర, కాకర, పుదీనా, బీట్ రూట్, మొక్కజొన్న, క్యారెట్, మిర్చి, వాము... ఇలా ఎన్నో రకాల మిశ్రమాలతో కూడిన వడియాలను గంగా భవాని బృందం తయారు చేస్తుంటుంది. ఈ కృషిలో ఆమె భర్త, ఓ కుమారుడు చేయుతనందిస్తున్నారు. అన్నట్లు వీళ్లది ఏ ఊరో చెప్పలేదు కదూ.... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం, చొదిమెళ్ల పంచాయితీలోని లక్ష్మీపురం గ్రామం. కృషికి సృజనాత్మకత తోడైతే జీవితంలో కొత్తకోణాలెన్నో కనిపిస్తాయనడానికి ఈ కుటుంబమే ఉదాహరణ.

Tuesday, April 04, 2006

ఇంకా రి...టైర్ కాని మా...స్టార్

ఎందుకంటే ఆయన వయసు ఇంకా 80 ఏళ్లే మరి. పైగా తనకు ప్రభుత్వమిచ్చే పెన్షన్ డబ్బుల్ని కూడా పేద విద్యార్ధుల కోసం ఖర్చు చేస్తూ గత 18 సంవత్సరాలుగా ఉచితంగా విద్యా బోధన చేస్తున్నారు. మనం చెప్పుకుంటోంది గుంటూరు జిల్లా జూలకల్లు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు గంజిబోయిన కృష్ణారావుగారి గురించి. 1976లో ఈ పాఠశాలకు బదిలీపై వచ్చి, 1987లో పదవీ విరమణ చేసినా ఆయన ఈ ఊరు విడిచి వెళ్లకుండా ఆ గ్రామస్తుల ప్రేమాభిమానాలు కట్టిపడేశాయి. నక్సల్ ప్రభావిత జూలకల్లు గ్రామంలో విద్యార్ధులను తీర్చిదిద్దడంలో కృష్ణారావుగారు చూపిన కృషి, అంకితభావాలే ఇందుకు కారణం. 11 ఏళ్ల కిందటే పదవీ విరమణ చేసినప్పటికీ నేటికీ రోజూ ఈ పాఠశాలకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యా బోధన చేస్తూ తుదిశ్వాస విడిచే వరకూ ఈ ఉచిత విద్యాబోధన యజ్ఞాన్ని కొనసాగిస్తానని ఒట్టుపెట్టుకున్నారు. ఇదీ మన మా.....స్టార్ గారి జీవితంలోని కొత్త కోణం.

Monday, April 03, 2006

రజనీ సీఏ అయ్యింది

చార్టెడ్ అకౌంటెన్సీ... సర్వాంగాలూ ఆరోగ్యంగా ఉండి, ఇంటి నుంచి ఎప్పటికప్పుడు డబ్బు వస్తూ, ట్యూషన్లు పెట్టించుకుంటున్నా పూర్తి చేయలేక మధ్యలోనే ఈ కోర్సు విడిచిపెట్టిన వాళ్ల సంఖ్య వేలు, లక్షల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. కానీ కంటి చూపులేని రజనీ గోపాలకృష్ణన్ ఇందుకు భిన్నం. అందుకే ఆమె గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చిన్నప్పుడు పెన్సిలిన్ రియాక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలై 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే సరికి ఈమె కుడి కంటి చూపు పోయింది. ఎడమ కంటి చూపు మందగించినా అలాగే డిగ్రీ పూర్తిచేశారు. తదుపరి ఎందరికో సవాలుగా నిలిచిన చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో ఆమె చేరారు. సి.ఎ ఇంటర్ పూర్తయ్యే సరికి మొత్తం చూపు పోయింది. ఈలోగా ఆమె కన్న తండ్రి క్యాన్సర్ వ్యాధికి బలై పోయారు. తర్వాత మాతాజీ నిర్మలా దేవి నుంచి సహజ యోగ శిక్షణ పొంది రజని తనను తాను సన్నద్ధం చేసుకున్నారు. అనంతరం సామర్థనం అనే సంస్థ చేయూతనివ్వగా, జీఈ కంపెనీ వారు ఈమెకు ఓ కంప్యూటరును సమకూర్చి, పాఠ్యాంశాలను కూడా చదివి వినిపించే ఏర్పాట్లు చేశారు. నేర్చుకున్న యోగా ద్వారా క్లిష్టమైన ఎన్నో అంశాలను మెదడులో నిక్షిప్తం చేసుకొని స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాసి సిఎలో దిగ్విజయంగా ఉత్తీర్ణురాలయ్యారు. అంతటితో ఆమె ఆగిపోలేదు. బెంగళూరులో తాజ్ వెస్టెండ్ కమ్యూనిటీ కోఆర్డినేటరుగా ఎందరో అంధులకు కంప్యూటర్ ద్వారా పాఠాలు చెబుతూ సేవలందిస్తున్నారు. ఇంకా తనను ఆదరించిన సామర్ధనం సంస్థకు కూడా వీలైనంత తోడ్పడుతున్నారు. రజనీ ప్రతిభను గుర్తించిన చెన్నైలోని ఎబిలిటీ ఫౌండేషన్ సంస్థ కెవిన్‌కేర్ ఎబిలిటీ అవార్డుతో గౌరవించింది. రజనీ ది గ్రేట్.

Wednesday, March 29, 2006

ఎనిమిదే చదివింది ... దేశాలు తిరిగింది

మొక్కవోని దీక్షతో చేసిన స్వయంకృషే కస్తూరికి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం వచ్చేలా చేసింది. తమిళనాడులోని మదురై జిల్లా పెరుంగుడికి చెందిన ఈమె చదువు కేవలం 8వ తరగతి మాత్రమే. భర్త ఆటో డ్రైవర్ కాగా, నలుగురు పిల్లలతో కూడిన కుటుంబం ఆమెది. సిసిడి (కోనేనంట్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్) ద్వారా ప్రారంభమైన మహిళా స్వయం సహాయక బృందం సభ్యురాలిగా కస్తూరి ఉత్సాహంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. వివిధ సమస్యలపై సిసిడి నిర్వహించే సమావేశాల్లోని ప్రతి విషయాన్నీ కూలంకుషంగా అధ్యయనం చేసి, చివరకు ఈ సమావేశాలకు ఆమె ప్రధాన వక్తగా మారారు. తన చొరవ, ఉత్సాహంతో ఎనిమిది జిల్లాల మహిళా స్వయం సహాయక బృందాలకు నాయకురాలయ్యారు. సమావేశాల ద్వారా వివిధ బృందాల స్త్రీల కష్టనష్టాలను పరిశీలించి వారి ఆదాయంలో అధిక మొత్తం వైద్యానికే సరిపోతోందని కస్తూరి గ్రహించి ఓ పరిష్కారం కోసం నడుం బిగించారు. వైద్యానికి ఉపకరించే వనమూలికల పెంపకం దిశగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారీమె. ఇప్పుడు ఈ ఉద్యమం సుమారు 125 గ్రామాలకు విస్తరించింది. అంతటితో ఆగక సునామీ బాధిత ప్రాంతమైన నాగపట్టణం జిల్లాలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టి నిరాశ్రయులెందరికో పునరావాసం కల్పించారు. కస్తూరి కృషి, పట్టుదల గురించి తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి అధికారులు పంపిన ఆహ్వానంపై ఆమె దక్షణాఫ్రికాలో వనమూలికల పెంపకంపై జరిగిన సదస్సుకు హాజరై ప్రసంగించారు. ఆ తర్వాత సునామీ సహాయక చర్యలు - పునరావాసం అంశంపై న్యూయార్క్, వాషింగ్టన్, బాంగ్లాదేశ్‌లలోనూ అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ఎందరో తమ జీవితాల్లోని కొత్త కోణాలను స్పృశించేందుకు కస్తూరి జీవితం తప్పక స్ఫూర్తినిస్తుంది.

Tuesday, March 28, 2006

ఉద్యోగం చిన్నదే.... హృదయం పెద్దది

ఈయన రాజకీయ నాయకుడో, వ్యాపారవేత్తో లేదా పారిశ్రామిక వేత్తో కాదు. కడప జిల్లాలోని పులివెందుల ఫైర్ స్టేషన్ డ్రైవర్ నారాయణ జీవితం ఇది. ప్రతినెలా తన జీతంలోంచి కనీసం 500 రూపాయలను సమాజసేవకే వినియోగిస్తారు. తాను పనిచేస్తున్న ఫైర్ స్టేషన్ ఆవరణలో రూ.35 వేల ఖర్చుతో నీటి ట్యాంక్ ఏర్పాటు చేయడమేగాక ఫైరింజన్‌కు 2 వేల రూపాయల ఖర్చుతో రంగు వేయించారు. ప్రభుత్వ ఖర్చుతో జరగాల్సిన ఎన్నో మంచి పనులకు తన సొంత డబ్బును ఖర్చు చేసారు. తన కార్యాలయానికే గాక సమీపాన గల గాంధీనగర్ పాఠశాలకు నారాయణ అందించిన తోడ్పాటు అంతా ఇంతా కాదు. ఈ పాఠశాలకు బీరువా, జెండా దిమ్మె, క్రీడా పరికరాలు, ప్లాస్టిక్ నీటి ట్యాంకు, గడియారం ఇంకా ఎన్నెన్నో నారాయణ జీతంలోంచి సమకూరాయి. ఇంతేగాక ఈ ఊరిలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో నారాయణ అందించిన గడియారాలు అతని సేవా తత్పరతకు ప్రతీకగా నిలుస్తాయి. అవి మోగించే ఘంటికలు జీవితకాలపు విలువను చెప్పకనే చెబుతుంటాయి. పదవీ విరమణాతరం తనకు వచ్చే పింఛను మొత్తాన్ని సేవాశ్రమ నిర్మాణానికి ఉపయోగించాలన్నది నారాయణ లక్ష్యం.

Monday, March 27, 2006

బధిరులు నడిపే భోజనశాల

వివేక్ కొఠారి.... పుట్టుమూగ, చెవుడు. ఈ వైకల్యం కారణంగా ఒకప్పుడు హేళనలకు కూడా గురైయ్యాడు. తీవ్రమైన శారీరక సమస్యలున్నా అమెరికా వెళ్లి పై చదువులు కూడా చదువుకున్నాడు. ఇప్పుడితని స్థాయి ఏంటో తెలుసా? జైపూర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంపై విజయవంతంగా నడుస్తున్న రివాల్వింగ్ రెస్టారెంట్‌కు యజమాని. ఈ హోటల్ ఏర్పాటులో పలు ఆటంకాలెదురు కాగా న్యాయపోరాటాలు చేసి మరీ అనుకున్నది సాధించాడు. మరో విశేషమేమంటే... ఇతని సిబ్బందిలో పాతిక శాతం మంది బధిరులేనట. తద్వారా తనలాంటి వికలాంగులకు అండగా నిలుస్తున్నాడు. జైపూర్ వెళ్లేవారికి ఈ హోటల్ కూడా ఓ పర్యాటక స్థలమే.

Friday, March 24, 2006

సమైక్యత కోసం ఆసనాలు

దేశ సమైక్యత దిశగా సమాజాన్ని ప్రేరేపించడానికి తన వంతు ఏం చేస్తే బాగుంటుంది ? మద్రాసు సమీపానగల పట్టాభిరాంలోని భారతీనగర్‌కు చెందిన సిద్ధ వైద్యులు, యోగాసనాల నిపుణులైన అన్బరసన్‌కు వచ్చిన ఆలోచన ఇది. తనకు తెలిసిన విద్యనే ఇందుకు సాధనంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన జాతీయ పతాకాలను చేబూని, తలపై కూడా పతాకాన్ని ధరించి, వినూత్న రీతిలో అనేక రకాల అసనాలు వేసి జాతి సమైక్యత దిశగా జనావళిని ప్రేరేపించేందుకు పతాకస్థాయిలో ప్రయత్నం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇదొక్కటే కాదు ఏటా స్వాతంత్ర్య దినమైన ఆగష్టు 15వ తేదీన కూడా దేశ శాంతిని కోరుతూ ఇలాంటి భిన్నమైన కార్యక్రమాలను అన్బరసన్ నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లకు పైగా ఆయన శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తూ విశిష్ట రీతిలో దేశమాతకు సేవలందిస్తున్నారు. ఇదీ ఆయన జీవితంలోని సరికొత్త కోణం.

Thursday, March 23, 2006

వీళ్ల ముందు మా సేవలెంత...

పై మాటలన్నది ఆ జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చదవండి. వాళ్ల ముగ్గురు పిల్లలతో పాటు ఇంటికొచ్చిన ఏడుగురు బంధువుల్నీ సునామీ రూపంలో ఎగసిన సముద్రం మింగేసింది. అదికూడా ఆ ఇంటి పెద్ద పుట్టిన రోజున. తమిళనాట నాగపట్టణంలో ఓఎన్‌జీసీ ఉద్యోగి పరమేశ్వరన్, అక్కడే పనిచేస్తున్న ఎల్ఐసీ ఉద్యోగిని చూడామణి దంపతుల వ్యధాభరిత కథ ఇది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఏం చేసారో తెలుసా? దైన్యంతో మూల కూర్చోలేదు. ధైర్యంగా ముందడుగేసి తమలాంటి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కన్యాకుమారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశంజిల్లా వరకూ ప్రయాణించి తమలాంటి బాధితులకు ఊరటనిచ్చే ప్రయత్నం చేసారు. అంతటితో ఆగలేదు. నంబిక్కై (నమ్మకం) పేరిట సేవా సంస్థను ప్రారంభించారు. సునామీ విలయతాండవంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలలను చేరదీసి, వారి జీవితంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ వసుధైక కుటుంబానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల ఈ ప్రాంతానికి వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ దంపతులను కలుసుకొని ఈ కథలాంటి ఈ నిజాన్ని ప్రతి చోటా చెబుతానన్నారు.

అతను అన్నీ చేయగలడు...

అతను టీ కప్‌ను భుజంపై పెట్టుకొని తాగుతాడు. స్క్రూడ్రైవర్ పట్టుకొని రేడియో, టీవీ, సెల్‌ఫోన్... ఇలా ఏది పాడైనా బాగుచేస్తాడు. ఖాతాదార్లు కూడా ఎక్కువమందే. చూట్టానికి ముచ్చటేస్తుంది కూడా. ఇవి కాకుండా స్విచ్ వేస్తాడు, పుస్తకాలూ పట్టుకోగలడు. మొదట చెప్పిన విషయం తప్ప మిగిలినవి చాలామంది చేసేవేగా, కొత్తేముంది అంటారేమో.... ఆగండాగండి. ఇవన్నీ అతను కాళ్లతో లేదా నోటితోనే చేస్తాడు. ఎందుకంటే అతనికి పుట్టుకతోనే చేతుల్లేవు. చెన్నై సమీపాన గల విల్లివాక్కం ప్రాంతానికి చెందిన హాసిన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. చేతుల్లేవన్న నిజం మొదట బాధ కల్గించినా, తల్లిదండ్రుల చేయూతతో చాలా పనులు కాళ్లతో లేదా నోటితోనే చేసుకోవడం నేర్చుకున్నాడు హాసిన్. అంతటితో హాసిన్ తన జీవితాన్ని సరిపెట్టుకోలేదు. తన మిత్రులు స్థాపించిన జీవన్ వెల్ఫేర్ సొసైటీ తరపున పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఎయిడ్స్ వ్యాధిపై సమాజానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. పదో తరగతే చదువుకున్నా హాసిన్ పది మందికీ ఎలా ఉపయోగపడుతూ జీవితంలోని కొత్త కోణాల్ని ఆస్వాదిస్తున్నాడో తెలుసుకున్నారుగా....

Wednesday, March 22, 2006

భర్త వీరమరణం...భార్య సైన్యం వైపు

పెళ్లయిన 19 నెలలకే శ్యామలి ఆర్య భర్త, సైనికుడైన కెప్టెన్ సంజయ్ ఆర్య సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో మరణించారు. అప్పటికి నెలల పసికందు శ్యామలి ఒడిలో ఉంది. ఇదే పరిస్థితిలో మరో ఆడబిడ్డ ఉంటే వారు ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉండేవారు ఊహించడం పెద్ద కష్టం కాదు. కానీ, శ్యామలి ఇప్పుడెలా ఉందో తెలుసా ? మాతృదేశ రక్షణకోసం ప్రాణాలు విడిచిన భర్త అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నారు. కఠోర దీక్షతో కృషిచేసి చెన్నై పరంగిమలైలో ఉన్న భారత సైనిక విభాగం నిర్వహించిన సైనిక ప్రవేశ పరీక్షలో విజయం సాధించారు. ఏ సైన్యంలో పని చేస్తూ తన భర్త ప్రాణ త్యాగం చేసారో అదే సైన్యంలో లెఫ్ట్‌నెంట్ స్థాయి సైనికాధికారి పదవికి శ్యామలి చేరువై తన జీవితంలోనే కొత్త కోణాన్ని వీక్షించారు. శ్యామలి జీవితం మన దేశంలో ప్రతి ఒక్కరికీ పాఠమే.

రియల్ సన్... నెల్సన్

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన 24 ఏళ్ల వికలాంగుడు నెల్సన్‌కు మూడు చక్రాల సైకిలే ఆధారం. క్షణకాలపు ఆవేశంతో దేశంలో ఎందరో ఎయిడ్స్ బారిన పడి జీవనాధారాన్ని కోల్పోతున్నారన్న నిజం అతన్ని ఊరకే ఉండనివ్వలేదు. వెంటనే తన మూడు చక్రాల సైకిల్‌నే ప్రచార రథంగా మార్చుకొని ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పర్యటన ప్రారంభించాడు. సుమారు 160 రోజులుగా దాదాపు 1600 కిలోమీటర్లకు పైగా వివిధ ప్రాంతాలలో పర్యటించి ఎందరో గ్రామీణ ప్రజలకు, అక్కడి పాఠశాల విద్యార్ధులకు ఎయిడ్స్ భూతం గురించి చెప్పి హెచ్చరించాడు. ముఖ్యంగా డ్రైవర్లకు ఈ వ్యాధి పట్ల అవగాహన లేక ఎక్కువగా ఎయిడ్స్ బారిన పడుతున్నారని తెలుసుకున్న నెల్సన్ వారిని ప్రధాన లక్ష్యంగా చేసుకొని విస్తృత ప్రచారం చేసాడు. ఇతని పట్టుదలకు మెచ్చుకున్న తమిళనాడు ఎయిడ్స్ నివారణ సంస్థ తగినంత చేయూతనిస్తోంది. ఈ ప్రచారంతో పలు జీవితాలను తీర్చిదిద్ది కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు మన నెల్సన్.

వైకల్యమున్నా.... ఆటల్లో మేటి

చెన్నై సమీపాన అరక్కోణానికి చెందిన అరవిందరాజ్ నిజంగా హీరోనే. ఇతని కథేంటో తెలుసా ? తొమ్మిది నెలల వయసుకే పోలియో రావడంతో రెండు కాళ్లూ వైకల్యానికి గురయ్యాయి. ఆ వైకల్యాన్నే ఆయుధంగా మార్చుకొని అరవిందరాజ్ సాధించిన విజయాల పరంపర, ఇతని జీవితంలోని కొత్త కోణాల గురించి తెలుసుకోండి మరి. 1998, 2000 సంవత్సరాల్లో జరిగిన టేబిల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేత ఇతనే. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహేబిలిటేషన్ చెన్నైలో నిర్వహించిన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2002 సంవత్సరంలో బెంగళూరులో జరిగిన జాతీయ అథ్లెటిక్ పోటీల్లో షాట్‌పుట్, డిస్కస్‌త్రో విభాగాల్లో స్వర్ణాలు, జావెలిన్‌త్రో విభాగంలో రజతాన్నీ కైవశం చేసుకున్నాడు. ఆ తర్వాత 2004, 2006 సంవత్సరాల్లో బెంగళూరులోనే జరిగిన జాతీయ వికలాంగుల క్రీడల్లోనూ పాల్గొని టేబుల్ టెన్నిస్, వీల్ ఛైర్ బ్యాడ్మింటన్ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం అరక్కోణంలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్ టేబుల్ టెన్నిస్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అరవిందరాజ్ గతంలో కొరియాలో జరిగిన భూసన్ ఫెస్పిక్ గేమ్స్, చైనాలో జరిగిన నాలుగో ఫెస్పిక్ గేమ్స్‌కు అర్హత సాధించినా ఆర్థిక సమస్యల కారణంగా వెళ్లలేకపోయాడు. ఇప్పుడు మలేసియాలో జరిగే ఏసియన్ గేమ్స్‌లో పాల్గోనేందుకు అర్హత సాధించి సాయమందించే దాతల కోసం ఎదురు చూస్తూ ముందడుగేస్తున్నాడు.

నిన్న వెట్టిచాకిరీ...నేడు బాలల ప్రతినిధి

బీహార్‌లోని పరాసావన్‌కు చెందిన పేద ముస్లిం బిడ్డ గురియా ఖాతూన్. రెండేళ్ల కిందట నిరక్షరాశ్యురాలు, తొమ్మిదేళ్ల వయసుకే భూస్వాముల ఇంట వెట్టిచాకిరీ. ఇదీ ఆమె నేపథ్యం. మరిప్పుడో... బడికెళ్లని బాలల చేత పుస్తకాలు పట్టించే యునిసెఫ్ (ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ విభాగం) కార్యక్రమంలో భూమికను నిర్వహించాలంటూ ఆహ్వానం అందుకుంది. లండన్‌లో జరిగిన యునిసెఫ్ ప్రపంచ బాలల స్థితిగతుల నివేదిక విడుదల కార్యక్రమానికి భారత బాలల తరపు ప్రతినిధిగా పాల్గొంది. నేడు తోటి ముస్లిం బాలికలకు చదువు చెబుతూ కరాటే కూడా నేర్పుతోంది. చదువులోని ఆనందాన్ని ఆస్వాదించాలనే గురియా తపనే ఆమెకు ఈ హోదానిచ్చింది. గతంలో ఆమె పరిస్థితేంటో తెలుసా ? చదువు పేరెత్తితే తంతామని ఇంట్లో హెచ్చరికలు. మరోవైపు ఈడొచ్చిందని పెళ్ల ప్రయత్నాలు. ఎలాగో అమ్మ దగ్గర ఏడిస్తే మదరసాకు మాత్రం పంపారు. అక్కడ గురియా ఖురాన్ పఠనం, ఉర్దూ రాయడం నేర్చుకుంది. అదే సమయంలో ప్రభుత్వ విద్యాశాఖ నేతృత్వంలో నడిచే మహిళా సమాఖ్య నడిపే బడి గురించి గురియా తెలుసుకొని వెళ్లి చూసింది. చదువుపై మక్కువ ఎక్కువైంది. అప్పుడే మహిళా సమాఖ్య కార్యకర్త గురియాకు పరిచయమై ఆమె ఇంటికెళ్లి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేసింది. చివరకు గురియా పిన్ని చొరవతో ఆమె మార్గం సుగమమైంది. గురియా ఎంచుకున్న చదువు మార్గమే నేడు ఆమె పాలిటి స్వర్గం కదూ... ఇదీ ఆమె జీవితంలో కొత్త కోణం.

Tuesday, March 21, 2006

రోగిగా వచ్చింది... తోడై నిలిచింది

ఆమె ఎవరికీ చుట్టం కాదు. కానీ క్షణం పాటు కనిపించకపోతే చాలు అల్లాడిపోతారు. మనం చెప్పుకుంటోంది పులివెందుల ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలందించే రంగలక్ష్ముమ్మ గురించి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపాన లింగారెడ్డిపల్లె వాసి అయిన ఈమె ఆయాసంతో బాధపడుతూ చికిత్స కోసం 6 నెలల కిందట ఈ ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యవంతురాలైంది. అయితే, ఇదే ఆసుపత్రిలో పలుకరించే దిక్కులేక, సాయం చేసే తోడులేక అవేదనతో కుమిలిపోతున్న మహిళలు, వృద్ధులైన రోగులు చాలామందిని రంగలక్ష్ముమ్మ చూసింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి, నాటి నుంచీ అక్కడి రోగులపాలిటి ఆత్మబంధువుగా మారిపోయింది. బాధపడుతున్న వారిని ఊరడిస్తూ, కబుర్లు చెప్పి నిద్రపుచ్చుతుంది. ఎవరికేం కావాలన్నా బజారుకెళ్లి అన్నీ తెచ్చిపెడుతుంది. రోగుల మధ్య ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుందని అక్కడ పనిచేసేవారు అంటే .... నన్ను చూసుకోవడానికి మీరున్నారుగా అంటూ నవ్వేస్తుంది. తోటివారికి సాయపడటానికి ఆర్థిక స్థోమతే ఉండాల్సిన అవసరం లేదని, ఆదరించే మనసుంటే చాలనేది రంగలక్ష్ముమ్మ అందరికీ చెప్పేమాట. ముసలి వయసులో తనకు తోడులేదన్న దిగులును విడిచిపెట్టి, తోటివారినే తనవారిగా భావించి సాయంచేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న రంగలక్ష్ముమ్మ అందరికీ ఆదర్శం కదూ.

Sunday, March 19, 2006

వికలాంగులా మజాకా

వికలాంగులే జ్యోతి ప్రజ్వలన గావించి, ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, అన్నీ ఉన్న సమాజానికి తమ విజయగాథలను వినిపించి స్ఫూర్తినిచ్చిన అద్భుత కార్యక్రమం అది. నోటితో చిత్రాలు గీసే జనార్థన్, డ్రమ్స్ వాయించడంలో ఘనుడైన కేఆర్ ప్రసాద్, తమిళ సాహిత్యంలో డాక్టరేట్ అందుకున్న తొలి అంధుడు ఆర్.చంద్రన్... ఇలా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరిల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన వికలాంగులెందరో చెన్నై శివారు రెడ్‌హిల్స్ తిరువళ్లూర్ కూడలి వద్దగల శీనయ్యర్ నాడార్ రాజమ్మాళ్ల్ కళ్యాణ మండపానికి విచ్చేసి తమ సత్తా చాటారు. చెన్నై సమీపానగల పాడియనల్లూరులోని మదర్ థెరిసా పాఠశాల ప్రిన్సిపాల్, అంగవికలురకు చేయూతనిస్తూ ఆదుకుంటున్న సెల్వకూమార్ ఈ విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి. వివిధ రంగాల్లో ప్రవీణులైన వికలాంగులను సత్కరించారు. విజయాలు సాధించడానికి అంగవైకల్యం ఎంతమాత్రం అడ్డుకాదని చాటే "ఇదుదాన్ ఆరంభం (ఇదే ఆరంభం)" అనే చలనచిత్రం చిత్రీకరణ ఈ సందర్భంగా ప్రారంభమైంది.

Friday, March 17, 2006

నిన్న బెదిరినా... నేడు అదరగొడుతోంది

చెన్నైశివారు ప్రాంతమైన అలమాదికి చెందిన సంగీత అందరిలాంటి మామూలు ఆడపిల్ల. తండ్రి నటరాజన్ ఓ మామూలు ఉపాధ్యాయుడు. సంగీత రోజూ పాఠశాల నుంచి ఇంటికొస్తూంటే తన వెంటపడే అల్లరిమూకల వేధింపులకు ప్రతిరాత్రీ బాధపడేది. వెంటనే దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఇంటిదగ్గరుండే స్నేహితుని సాయంతో ఓ రోజు కరాటే తరగతుల్లో చేరింది. ఇప్పుడామె సాధించిన విజయాలేంటో తెలుసా ? ధర్మపురిలో జరిగిన దక్షిణభారత కరాటేపోటీల్లోను, చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే పోటీల్లో ప్రథమస్థానం దక్కించుకుంది. అలా సాగిన జైత్రయాత్ర ఆమెకు ఇంకెన్నో గౌరవాలను అందించింది. ఇప్పుడు తన ఇంటివద్ద సుమారు 150 మందికి కరాటే శిక్షణనిస్తున్నారు. ఈమె శిష్యుల్లో 70 మంది గృహిణులు కూడా ఉన్నారు తెలుసా. అమ్మాయిలూ.... సంగీతను స్ఫూర్తిగా తీసుకొని సంగీతంతో పాటు యుద్ధ కళల్ని కూడా నేర్చుకోండి మరి.

Thursday, March 16, 2006

అంధుడు కాదు జ్ఞానపుత్రుడు

మెదక్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన గంగారాం మూడో ఏటే మశూచి బారినపడ్డారు. నాటి నుంచీ అంధత్వంతోనే ఆయన బంధుత్వం నెరిపి, దృష్టిలేమినే ఆయుధంగా మలుచుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా తెలుగులో ఎం.ఎ పట్టా సాధించడమేగాక, పరిశోధన పత్రం సమర్పించి ఎం.ఫిల్ పట్టా కూడా దక్కించుకున్న తొలి అంధుడు గంగారాం. రాష్ట్ర ప్రభుత్వం అంధులకు ఇచ్చే అత్యుత్తమ సేవా పురస్కార గౌరవాన్ని పొందారు. ఇప్పుడు అంధుల పాఠ్యపుస్తకాలను ముద్రించే సంస్థలో గంగారాం సేవలందిస్తూ ఎందరికో సాయం చేస్తున్నారు. మన గంగారాం బంగారం కదూ.

పరీక్షలో విజేత 82 ఏళ్ల బామ్మ

మలేసియాలోని సిక్కు కుటుంబంలో పుట్టిన 82 ఏళ్ల మొహిందర్ కౌర్‌కు 11 మంది మనుమలు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. వారితో ఆటపాటలను కొనసాగిస్తూనే నవంబర్ 2005లో మలేసియా దేశవ్యాప్తంగా జరిగిన పంజాబీ పరీక్షకు హాజరై ప్రధమస్థానం పొందారు. గత 30 ఏళ్లుగా ఆమె అక్కడి పాఠశాలల్లో పంజాబీ ఉపాధ్యాయురాలిగా పని చేసారు. అయితే, ఈవిడ ఈ పరీక్షలో ఉత్తీర్ణురాలవడంలో గొప్పేముందని అనుకోవచ్చు. ఇక్కడి విషయం అది కాదు. బాధ్యతలన్నీ ముగిశాక ఊసుబోలు కబుర్లతో కాలక్షేపం చేయకుండా ఏదో ఒకటి సాధించాలన్న తపనతో ఆమె ముందడుగేసింది. ఈ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచి జీవితంలోని ఓ కొత్తకోణాన్ని ఆస్వాదించింది. వయసు కాదు, కృషి ముఖ్యమని చాటింది.

పేదవాడి పట్టుదలతో తెరుచుకున్న గేట్

కడప కేఎస్సారెమ్ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విద్యార్థి ఆర్.ప్రసాద్. తిరుపతి బొమ్మగుంట వీధిలో ఉంటున్న అతని తండ్రి శివాజీ ఒక ప్రయివేటు ఎలక్ట్రీషియన్, తల్లి స్వర్ణ మహిళా సంఘంలో సభ్యురాలు. సంఘంలో అమ్మ చేసే అప్పులే ప్రసాద్ చదువుకు పెట్టుబడి. ఆ పెట్టుబడినే పట్టుదలగా మార్చుకున్నాడు ప్రసాద్. కష్టపడి చదువుకొని గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షలో వెయ్యికి 758 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి స్థానం పొందాడు. ఈ వార్తను నేను ఈనాడు పత్రికలో చదివాను. ప్రసాద్‌ను మన విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందడుగేయాలి.

ఇంటికీ, బస్సుకూ ఆమే డ్రైవర్

నిత్యం రద్దీతో ఉండే చెన్నైలోని వడపళని, పట్టినబాకం ప్రాంతాలను కలిపే మార్గం అది. ఆ దారిలో రోజూ వెళ్లే 12బి నెంబరు బస్ డ్రైవర్ (ఈ కథనం రాసే నాటికి) హమీదాబాను జీవితం మహిళా లోకానికి స్ఫూర్తి అనడం అతిశయోక్తి కాదేమో. చెన్నై సిటీబస్సుల నిర్వహణ సంస్థ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (ఎమ్‌టిసి)లో స్థానం దక్కించుకున్న తొలి మహిళా డ్రైవర్ ఆమె. బస్సుతో పాటు ఇల్లాలుగా ఇంటినీ నడిపే హమీదా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినా, ఆ స్థాయి ఉద్యోగమే కావాలని కూర్చోలేదు. విరామ సమయంలో లారీలు, బస్సుల మరమ్మతు విధానాలను నేర్చుకొని అందులో నిష్ణాతురాలయ్యారు. ముందు తాను చదివిన కారైకుడి (తమిళనాడు)లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ బస్సు డ్రైవరుగా విధులు నిర్వహించారు. విరామ సమయాల్లో టెక్నికల్ డ్రైవింగ్ తరగతులు నిర్వహిస్తూ యువతులకు ఆటో డ్రైవింగు నేర్పి తోటి మహిళలకు హమీదా ఆదర్శంగా నిలిచారు. డ్రైవర్ సీట్లో హమీదా ఉంటే ఇక భయమేలేదని ఆమె బస్సులోని ప్రయాణీకులు, సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి.

మడతపడిన సైకిల్...

తమిళనాడులోని కడలూర్ జిల్లా తెన్‌పాది గ్రామం.... అక్కడ చింతామణి అనే ఓ 80 (ఎనభయ్యే...) ఏళ్ల కుర్రాడు విరిగిన సైకిల్‌తో కనిపిస్తుంటాడు. కావలసినప్పుడు దాన్ని అతికించుకుని తొక్కుకుంటూ వెళిపోతుంటాడు. ఆ కుర్రాణ్ణి ఓసారి పలకరిస్తే... ఈ సైకిల్ కథ చెప్పాడు. అక్కర్లేనప్పుడు మడతపెట్టుకొని... అవసరమైనప్పుడు అమర్చుకొనే వీలుగల ఈ సైకిల్ దాదాపు 50 ఏళ్ల కంటే పాతదట. అప్పట్లో బ్రిటిష్ సైనికులు ఇలాంటి మడిచే సైకిళ్లను వేసుకొని హెలికాఫ్టర్‌లో ఆయా ప్రాంతాలకు చేరుకొనేవారట. హెలికాఫ్టర్లు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు ఈ సైకిళ్లపై వెళ్లి విధులు నిర్వహించేవారట. అలాంటి ఓ సైకిల్‌ను మన చింతామణిగారు సంపాదించి... నాటి నుంచి నేటి వరకూ దాన్నే ఉపయోగిస్తున్నారు. తిరుపతి, పళని, వేలాంగన్ని (క్రైస్తవ పుణ్యక్షేత్రం) వంటి ప్రముఖ క్షేత్రాలకు ఈ సైకిల్ పైనే వెళుతుంటారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యం బాగుంటుందని, దీనితో పాటు కాలుష్యానికి దూరంగా ఉంటూ జీవితంలో కొత్త కోణాలను ఆస్వాదించవచ్చనేది పదవీ విరమణ చేసిన ఈ ఉపాధ్యాయుని ఉవాచ.

Wednesday, March 15, 2006

సంచార దుకాణం - స్థిరమైన జీవితం

అతను ఎం.ఎ పట్టభద్రుడు. మొన్నటి నిరుపేద, నిన్నటి నిరుద్యోగి. నేడు.... నలుగురికి ఉపాధినిచ్చే యజమాని స్థాయి. అతనే పాండిచ్చేరికి చెందిన నెడుంజెళియన్. ఇదంతా ఎలా జరిగిందటారా ? అందరిలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నించినవాడే. ఒక దశలో పాండిచ్చేరిలోని జిప్‌మెర్ ఆసుపత్రిలో వెల్డింగ్ కార్మికుడిగానూ తాత్కాలికంగా పని చేసాడు. బతుకు బండి సరిగ్గా నడవకపోవడంతో ఇల్లు తాకట్టుపెట్టి ఈ ఆసుపత్రి దగ్గరే ఒక బడ్డీకొట్టు పెట్టుకొని ఖాళీ సమయాల్లో దానినీ చూసుకుంటూ రేయింబవళ్లూ కష్టపడ్డాడు. పరిస్థితి మెరుగుపడటంలో అప్పుతీర్చి ఇంటిని తాకట్టు నుంచి విడిపించుకున్నాడు. తర్వాత సంచార దుకాణం నడిపితే ఎలాగుంటుందనే కొత్త ఆలోచనతో మారుతీవ్యాను కొనుక్కొని ఆసుపత్రి పరిసరాల్లో దానిని సంచార దుకాణంగా నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు అతని స్థితి ఏమిటో తెలుసా ? మరో కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఇంకో సంచార దుకాణం పెట్టుకున్నాడు. మరిందరికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగాడు. ఉద్యోగం దొరకకపోతే దానికోసం చెప్పులరిగేలా తిరిగి సమయాన్ని వృధా చేసేకన్నా, కొంచెం కష్టపడేందుకు నేటి యువత ముందడుగేస్తే జీవితంలో హాయిగా స్థిరపడవచ్చని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు నెడుంజెళియన్.

నిన్న కూలీ .... నేడు అదర్శనారి

నాగ శిరోమణి చదివింది 5వ తరగతే. అయినా పనిలో మణిపూసే. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో మొన్న వ్యవసాయకూలీగా, నిన్న డ్వాక్రా మహిళగా ఎదిగి మదర్ థెరిసా సొసైటీకి నేతృత్వం వహించారు. విధి నిర్వహణలో చూపిన పట్టుదలతో అధికారుల దృష్టిలో పడి జాతీయ సమాచార సంస్థ ద్వారా కంప్యూటర్ శిక్షణనందుకున్నారు. రాయితీతో కూడిన రుణం పొంది, తన ఊరిలో సొసైటీ బృందం అండగా ఈ-సేవ కేంద్రాన్ని తెరిచి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరి నేడో.... అంతర్జాతీయ సంస్థ స్కాచ్ ఛాలెంజర్ ఇచ్చే గ్రాస్ రూట్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి చేరువయ్యారు. మన మహిళా లోకానికి ఈమె స్ఫూర్తిదాయకం కదూ...

నేల మీద కాగితం .... కాలితో కలం

ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలంలోని అటవీప్రాంత గ్రామమైన కుమ్మరిగూడెం వాసి పర్శిక రాజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి (ఈ కథనం రాసే నాటికి). చిన్నతనంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులూ పోయాయి. రోజూ అడవిమార్గంలో నడచి మణుగూరులోని జూనియర్ కళాశాలలో జరిగే తరగతులకు వస్తుంటాడు. మరి పాఠ్యాంశాలు ఎలా రాసుకుంటాడనేగా మీ సందేహం ? విజేతకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి. పట్టుదలను కలగలిపి కాలితోనే కలం పట్టి రాయడం నేర్చుకున్నాడు. చక్కని దస్తూరిని అలవరుచుకున్నాడు. ఉజ్వల భవిత దిశగా అడుగులేస్తుంటాడు.

ఈ అపరిచితులు మనవాళ్ళే...

జీవకోటి పట్ల ప్రేమానురాగాలు కలిగి విశ్వకళ్యాణం దిశగా ఏదైనా చెయ్యాలన్న తపనకు తగినంత కృషి తోడైతే చాలు, బీద, గొప్ప అనే తారతమ్యం లేకుండా జీవితాన్ని అర్థవంతంగా, స్ఫూర్తి దాయకంగా తీర్చిదిద్దుకోవచ్చు. విజయాల బాటలో పయనించవచ్చు. అలాంటి ప్రయత్నాలు చేసి ఆదర్శవంతంగా నిలిచినవారెందరో మనతోనే ఉన్నారు. వివిధ పత్రికల్లో లభించిన వివరాలు, నేను వ్యక్తిగతంగాను, మిత్రుల సాయంతో సేకరించిన సమాచారం మేరకు, అటువంటి ఆదర్శమూర్తులు వీలైనంత ఎక్కవమంది గురించి విస్తృతంగా అందరికీ తెలియాలన్న కోరికతో ఈ బ్లాగ్ ప్రారంభించాను. ఇందులో ఎప్పుడో జరిగి ఇప్పుడే నా దృష్టికి వచ్చిన విషయాలు కూడా ఉంటాయి. నేను 12 ఏళ్ళకు పైగా తమిళనాడులో ఉన్నందున అక్కడ సంభవించిన వాస్తవ ఘటనలు, నిజ జీవిత సంఘటనలు కాస్త ఎక్కువగా ఉంటాయి. లేమిని చూచి భయపడుతూ నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే వారిలో కొందరైనా లేదా ఒక్కరైనా ఇక్కడి నుంచి స్ఫూర్తి పొంది ఒక్కడుగు ముందుకేసినా చాలు, నా ప్రయత్నం ఫలించినట్లే.....